పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ను ఆర్థికంగా మరియు వ్యూహాత్మకంగా దెబ్బతీయడానికి అమెరికా ‘అష్టదిగ్బంధనం’ సిద్ధం చేస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, అగ్రరాజ్యం తన ఆర్థిక ఆయుధాలకు పదును పెడుతోంది. అమెరికా ట్రెజరీ శాఖ తాజాగా జారీ చేసిన హెచ్చరికలు ఇరాన్కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా చైనా బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపై కన్నేసిన అమెరికా, “సెకండరీ సాంక్షన్స్” విధిస్తామని స్పష్టం చేసింది. గతంలో తన చమురు అవసరాల్లో 8 శాతం ఇరాన్ నుంచే పొందిన చైనా, ఇప్పుడు అమెరికా ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిలో అమెరికా తన సముద్ర నిఘాను కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే 10 భారీ నౌకలను అమెరికా సెంట్రల్ కమాండ్ వెనక్కి తిప్పి పంపడం చూస్తుంటే, ముట్టడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్యా–ఇరాన్ మధ్య జరిగే ఆయిల్ లావాదేవీలకు ఇప్పటివరకు ఇచ్చిన మినహాయింపులను పొడిగించే ప్రసక్తే లేదని వైట్ హౌస్ తేల్చి చెప్పింది. దీనికి అదనంగా, అక్రమ చమురు రవాణాకు పాల్పడుతున్న 20కి పైగా కంపెనీలు మరియు వ్యక్తులపై కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
సైనిక పరంగా కూడా అమెరికా తన పట్టు బిగిస్తోంది. ఇరాన్ సరిహద్దుల సమీపంలో 10 యుద్ధ నౌకలను మరియు 10,000 మంది సైనికులను మోహరించడం ద్వారా అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమేనని సంకేతాలు ఇస్తోంది. ఇజ్రాయెల్ అండతో అమెరికా చేస్తున్న ఈ వ్యూహాత్మక దాడులు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉన్నాయి. అయితే, ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమపై ఏ చిన్న దాడి జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఈ ‘ఆర్థిక యుద్ధం’ గనుక ముదిరితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి, సామాన్యుడి జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.