ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఏపీ స్టేట్ ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ (SLAC) ఏకంగా రూ. 2036.59 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 915 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అందులో 599 ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11,488 మంది నిరుద్యోగులకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితం కాకుండా, 19 జిల్లాల్లో 215.80 ఎకరాల్లో ఈ పరిశ్రమలు విస్తరించబోతుండటం విశేషం.
ముఖ్యంగా తయారీ రంగం, ఎమ్ఎస్ఎమ్ఈ (MSME), ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాలకు పెద్దపీట వేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా భూములు కేటాయించాలని, ప్రాజెక్టులను వెంటనే పట్టాలెక్కించాలని కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రాంతీయ అసమానతలు తొలగించి, అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ భారీ పెట్టుబడులు ఏపీ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, స్థానిక యువతకు సొంత ఊర్లోనే ఉద్యోగాలు కల్పించే దిశగా బలమైన పునాది వేయనున్నాయి. ఏపీలో పారిశ్రామిక వేగం ఇప్పుడు నెక్స్ట్ లెవల్కు చేరుకుందనే చెప్పాలి!